- తాండూరు అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా సహకరించండి..
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తానని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం తాండూరు మున్సిపల్ నూతన చైర్పర్సన్గా పట్లోళ్ల నీరజ, వైస్ చైర్మన్గా అబ్దుల్ రజాక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….తాండూరు పురోగతి కోసం తాను కన్న 15 ఏండ్ల కల నేడు నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు.
అభివృద్ధే మా ప్రాధాన్యత
పట్టణ అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, రాజకీయాలకు అతీతంగా కౌన్సిలర్లు, నాయకులు సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నూతన పాలకవర్గం పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన చైర్పర్సన్
మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన పట్లోళ్ల నీరజ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ప్రతి వార్డులో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కలిసికట్టుగా ముందుకు: అబ్దుల్ రజాక్
మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం అన్ని పార్టీలను, వర్గాలను కలుపుకొని ముందుకు సాగుతామని వెల్లడించారు. తాండూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.



