- బషీరాబాద్లో ఇసుక మాఫియా బరితెగింపు
- ఎస్ఐ వాహనంపైకి దూసుకెళ్లిన ట్రాక్టర్లు!
- తృటిలో తప్పించుకున్న ఎస్ఐ శ్రీశైలం యాదవ్, సిబ్బంది
- నిందితులు సురేష్, శ్రీనివాస్ పరారీ.. పోలీసుల గాలింపు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా అరాచకాలు హద్దులు దాటాయి. అక్రమ దందాను అడ్డుకోబోయిన ఖాకీలపైకే మృత్యుశకటాలను ఎక్కుపెట్టారు. బషీరాబాద్ మండలంలో మంగళవారం ఉదయం ఇసుక అక్రమ రవాణాదారుల దౌర్జన్యం పరాకాష్టకు చేరింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపైకి ట్రాక్టర్లతో దూసుకెళ్లి, ఏకంగా ఎస్ఐ వాహనాన్నే ఢీకొట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఘటన వివరాల్లోకి వెళ్తే..బషీరాబాద్ ఎస్ఐ శ్రీశైలం యాదవ్ తన సిబ్బందితో కలిసి మంగళవారం ఉదయం మండలంలోని కోర్విచేడ్ గేటు సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దామర్చేడ్కు చెందిన సురేష్, నంద్యానాయక్ శ్రీనివాస్ అనే వ్యక్తులు తమ ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా నవల్గా వైపు తరలిస్తూ కనిపించారు. అప్రమత్తమైన పోలీసులు ట్రాక్టర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులను చూసి భయపడాల్సింది పోయి, నిందితులు రెచ్చిపోయారు. తమ ట్రాక్టర్లను వేగంగా పోలీసు వాహనంపైకి పోనిచ్చారు. తప్పించుకునే లోపే పోలీస్ వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ అనూహ్య దాడితో ఎస్ఐతో పాటు సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వాహనం పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎస్ఐ శ్రీశైలం యాదవ్ మరియు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాకుండా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.ఘటన అనంతరం నిందితులు ట్రాక్టర్లతో సహా అక్కడి నుండి పరారయ్యారు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు నిందితుల నివాసాలకు వెళ్లి విచారించగా, వారు పరారీలో ఉన్నట్లు తేలింది.





