- లైసెన్స్ లేని కల్లు విక్రయాలపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు
- అవాంఛనీయ ఘటనలు జరిగితే మాకు సంబంధం లేదు
- టీసీఎస్ ప్రెసిడెంట్ రాజలింగం గౌడ్
తాండూరు జనవాహిని ప్రతినిధి : తాండూరు మండలం చెన్ గేష్ పూర్ గ్రామంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా సాగుతున్న కల్లు విక్రయాలపై గ్రామ గౌడ సంఘం (టీసీఎస్) ప్రతినిధులు ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం తాండూరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వారు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా టీసీఎస్ ప్రెసిడెంట్ వై. రాజలింగం గౌడ్ మాట్లాడుతూ.. గ్రామంలో 43 మంది సభ్యులతో కూడిన సంఘం ఆధ్వర్యంలో కల్లు విక్రయాలు సాగుతున్నాయని తెలిపారు. అయితే, ఇదే గ్రామానికి చెందిన సర్పంచ్ వై. ప్రవీణ్ గౌడ్ ఎలాంటి లైసెన్స్ లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.లైసెన్స్ లేని కల్లు తాగి ఎవరైనా మరణించినా లేదా ఇతర అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి తమ సంఘానికి ఎలాంటి సంబంధం ఉండదని, ఆ పూర్తి బాధ్యత ప్రవీణ్ గౌడ్ దేనని వారు స్పష్టం చేశారు. ఈ నెల 2వ తేదీన ఎక్సైజ్ పోలీసులు గ్రామానికి వచ్చి సదరు వ్యక్తి వద్ద లైసెన్స్ లేనందున కల్లును పారబోసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ముందస్తుగా అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ ఫిర్యాదు వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయానికి కూడా పంపినట్లు వారు వెల్లడించారు.



