- మున్సిపల్ కౌన్సిల్ సాక్షిగా 19వ వార్డు సమస్యల ఏకరువు
- SC, ST సబ్ ప్లాన్ నిధులు వార్డు అభివృద్ధికి మళ్లించాలి
- నాలా, డ్రైనేజీ సమస్యలపై అధికారుల దృష్టికి..
- దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే, మున్సిపల్ అధికారుల హామీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నేడు తాండూరు మున్సిపల్ కార్యాలయం లో నిర్వహించారు. ఈ సందర్భంగా 19వ వార్డులో నెలకొన్న పలు ప్రజా సమస్యలు చర్చకు వచ్చినట్లు స్థానిక కౌన్సిలర్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా… కౌన్సిలర్ జంటుపల్లి వెంకట్ మాట్లాడుతూ….సీతారాంపేట్, చెన్మిల్లా గార్డెన్, విశ్వంభర కాలనీ, సాయి నగర్, బృందావన కాలనీ, అల్ కరీం కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, కమిషనర్ మరియు ఇంజనీరింగ్ అధికారులను కోరినట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎస్సి, ఎస్టీ 2017 మరియు జిఓ no. 48 ప్రకారం.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని సభ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ నిధులను ఇతర పనులకు మళ్లించకుండా, కేవలం ఆయా ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని, స్మశాన వాటికల్లో బోర్ల ఏర్పాటు, హై-మస్ట్ లైట్ల ఏర్పాటు వంటి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బృందావన కాలనీలో డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, స్మశాన వాటిక ముందున్న పెద్ద నాలా వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. దోమల నివారణకు చర్యలు చేపట్టి, మురుగు కాలువలు శుభ్రం చేయాలని శానిటేషన్ అధికారులకు సూచించారు.వార్డులోని వీధి దీపాలను సరిచేసి వెలుగులు నింపాలని, సేనిగేష్ పూర్ రోడ్డులోని ఈద్గా వద్ద విద్యుత్ లోటును అధిగమించడానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా రక్షిత తాగునీరు అందించాలని విన్నవించారు. విశ్వంభర కాలనీ పార్కును అభివృద్ధి చేయాలని, సీతారాంపేట్ అంగన్వాడీ భవన సమస్యను పరిష్కరించాలని వెల్లడించారు. అదేవిదంగా అంబేద్కర్ చౌక్ వద్ద విగ్రహ పునఃనిర్మాణం చేపట్టి, మహనీయుల జయంతి వేడుకలకు ఆటంకం లేకుండా చూడాలన్నాని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మున్సిపల్ ఛైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్.. వార్డులోని సమస్యలను తాము గుర్తించామని, నిధుల లభ్యతను బట్టి దశలవారీగా అన్ని పనులను పూర్తి చేస్తామని సభలో హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.




