- వికారాబాద్లో మునిసిపల్ కౌంటింగ్
- పోలీసుల ‘ఉక్కు’ బందోబస్తు!
- జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు
- విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
- స్పష్టం చేసిన ఎస్పీ స్నేహ మెహ్రా
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా ముగించేందుకు పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు.జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. ప్రతి కదలికను సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుండి పర్యవేక్షించనున్నారు. అనుమానితులపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగాయని తెలిపారు. గెలిచిన ఉత్సాహంలో రోడ్లపైకి వచ్చి ర్యాలీలు తీయడం, బైక్ రేసింగ్లు చేయడం పూర్తిగా నిషేధం. డీజేలు, లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదు. బాణాసంచా కాల్చడంపై ఆంక్షలు ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రాల చుట్టుపక్కల ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది కనిపిస్తే చర్యలు తప్పవు.ఎన్నికల ఫలితాల అనంతరం అభ్యర్థులు, వారి అనుచరులు భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనం పాటించాలని ఎస్పీ కోరారు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల నియమావళిని గౌరవించాలని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించవద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు.






