- రోహిత్ రెడ్డి అవాకులు చవాకులు కట్టిపెట్టాలి..!
- కాంగ్రెస్ నేత ప్రభాకర్ గౌడ్…
జనవాహిని ప్రతినిధి తాండూరు: మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తనపై ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తాండూరు కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం తాండూరులో ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రోహిత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.ఈ సందర్బంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ… రంగులు మార్చడంలో రోహిత్ రెడ్డిది అందెవేసిన చేయి అని, అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడిపోయాక మరోలా మాట్లాడటం ఆయనకు అలవాటేనని విమర్శించారు. తాండూరు ప్రజలు ఎవరిని ‘నంగనాచి’ అంటున్నారో రోహిత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.తప్పు చేశారు కాబట్టే పోలీసులు కేసు నమోదు చేశారని, బెయిల్ తెచ్చుకుని స్టేషన్కు రావడం గొప్ప కాదని ఎద్దేవా చేశారు. తప్పుడు కేసులు అని గప్పాలు కొట్టడం మానేసి, విచారణలో నిజానిజాలు తేల్చుకోవాలని సవాల్ విసిరారు.మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సమయంలో అల్లర్లు సృష్టించి, అధికారులను భయభ్రాంతులకు గురిచేసింది బీఆర్ఎస్ నాయకులేనని ప్రభాకర్ గౌడ్ ఆరోపించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు సహించబోరని హెచ్చరించారు.19 వేల ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్న రోహిత్ రెడ్డి, ప్రజలు కాంగ్రెస్ను ఎందుకు గెలిపించారో తెలుసుకోవాలన్నారు. తాండూరు అభివృద్ధి కేవలం కాంగ్రెస్ హయాంలోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. పోలీసులపై నోరు పారేసుకుని, చెయ్యి చేసుకొని, ఇప్పుడు క్షమాపణలు కోరడం రోహిత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. కేసులు, అరెస్టుల భయంతోనే ఆయన ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. తప్పుడు కేసు అయినప్పుడు ఎన్ని రోజులు భయపడి దక్కోవడం ఎందుకని ప్రశ్నించారు. బెయిల్ పేపర్ లతో ఒక్కరే వచ్చేది వదిలేసి.. నార్కో టెస్ట్ చేస్తారనే భయం తో రోహిత్ రెడ్డి అనుచరులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు అని విమర్శించారు. తప్పుడు మాటలు మానుకొని, ఇకనైనా తాండూరు అభివృద్ధికి సహకరించాలని కోరారు.



