- యువత మేల్కొంటేనే ఆరోగ్యవంతమైన సమాజం..
- డా. జయప్రసాద్
- శాలివాహన డిగ్రీ కళాశాలలో రక్తపోటుపై అవగాహన సదస్సు
జనవాహిని ప్రతినిధి తాండూరు : యువత తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉంటూ, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అలవర్చుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (తాండూరు అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక శాలివాహన డిగ్రీ కళాశాలలో గ్లెన్ మార్క్ కంపెనీ సౌజన్యంతో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ‘ఆరోగ్య అవగాహన కార్యక్రమం’ నిర్వహించారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న రక్తపోటు సమస్యలు, వాటి నివారణపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు.ఈ సందర్భంగా డాక్టర్ జయప్రసాద్ మాట్లాడుతూ.. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతత కరువవుతోందని, అది నేరుగా ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి ప్రశాంతమైన జీవనశైలి, పోషకాహారం, మరియు నిరంతర వ్యాయామం తప్పనిసరి అని సూచించారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, నకిలీ లేదా నాటు వైద్యాన్ని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. విద్యార్థులు తమతో పాటు తమ కుటుంబ సభ్యుల్లో కూడా ఆరోగ్య స్పృహను పెంపొందించాలని కోరారు. యువజాగృతి అధ్యక్షులు పర్యాద రామకృష్ణ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన యువత వల్లనే దేశం శక్తివంతంగా మారుతుందని అన్నారు. ప్రతి విద్యార్థి ఒక బాధ్యతగా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శరత్ చంద్ర, గ్లెన్ మార్క్ డిజిఎం వేణుమాధవ్, అధ్యాపక బృందం మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.



