- మున్సిపల్ పీఠంపై గులాబీ జెండా ఎగురవేస్తాం, అనిల్ బాండ్
- 36వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి రూప పాటిల్ విజయానికి ముమ్మర ప్రచారం
జనవాహిని ప్రతినిధి తాండూరు : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి క్లీన్ స్వీప్ చేయబోతుందని, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని పార్టీ కచ్చితంగా కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ యువ నాయకులు అనిల్ బాండ్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలోని 36వ వార్డులో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి రూప పాటిల్ మద్దతుగా ఆయన జోరుగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రతి వీధిలో పర్యటిస్తూ ఓటర్లను అభ్యర్థించారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని పేర్కొన్నారు. 36వ వార్డు అభ్యర్థి రూప పాటిల్, రుద్రు పాటిల్లకు స్థానికంగా మంచి ఆదరణ ఉందని, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దే సత్తా కేవలం బీఆర్ఎస్ అభ్యర్థికే ఉందని ఆయన స్పష్టం చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థులను ఆశీర్వదించాలని, వార్డు సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొని అభ్యర్థికి ఘనస్వాగతం పలికారు.






