- 34వ వార్డులో ‘ప్రజా పాలన’ రగడ
- ప్రోటోకాల్ వివాదంపై ప్రస్తుత కౌన్సిలర్ ఆగ్రహం
- మాజీ కౌన్సిలర్ సోము తీరుపై సుప్రీత కరణకర్ ఫైర్..
- ఉన్నతాధికారులకు ఫిర్యాదుకు నిర్ణయం
జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని 34వ వార్డులో నిర్వహించిన ‘ప్రజా పాలన’ కార్యక్రమం రాజకీయ రగడకు దారితీసింది. ప్రభుత్వ అధికారిక వేదికపై ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందంటూ మాజీ, ప్రస్తుత కౌన్సిలర్ల మధ్య వివాదం నెలకొంది. మాజీ కౌన్సిలర్ సోము జోక్యంపై ప్రస్తుత కౌన్సిలర్ సుప్రీత కరణకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ సోము అనవసరంగా ప్రవేశించి, అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని సుప్రీత ఆరోపించారు. ఏ హోదాలో ఆయన అధికారిక వేదికపైకి వచ్చి మాట్లాడుతారని ఆమె ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకనే వార్డు పెద్దలపై జులుం ప్రదర్శిస్తూ, కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరగాల్సిన ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తీరు వల్ల అటు అధికారులకు, ఇటు తనకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని కౌన్సిలర్ పేర్కొన్నారు. ప్రజా పాలన వేదికను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తగదని హితవు పలికారు.ప్రోటోకాల్ను తుంగలో తొక్కి, ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన సోముపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సుప్రీత కరణకర్ స్పష్టం చేశారు. వార్డు అభివృద్ధికి సహకరించాల్సింది పోయి, ఇలాంటి గొడవలకు దిగడంపై స్థానికులు సైతం చర్చించుకుంటున్నారు.



