Wednesday, February 4, 2026
Home NEWS మత్తుకు అడ్డాగా బస్తీ దవాఖానా…!

మత్తుకు అడ్డాగా బస్తీ దవాఖానా…!

0
194
  • చీకటి పడితే గంజాయి, మద్యం బ్యాచ్‌ల హల్చల్
  •  ఇందిరానగర్ నివాసాలపై రాళ్లు, సీసాలతో దాడి
  • ప్రహరీ గోడ లేకపోవడమే శాపం.. ఎమ్మెల్యే చొరవ కోరుతున్న స్థానికులు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని ఇందిరానగర్ బస్తీ దవఖానా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ కేంద్రం, రాత్రి వేళల్లో మందుబాబులు, గంజాయి ముఠాలకు సురక్షిత అడ్డాగా మారుతోంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు స్థానిక నివాసితులను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట రోగులతో కళకళలాడే దవాఖానా ప్రాంగణం, సాయంత్రం 6 గంటలు దాటితే చాలు అసాంఘిక శక్తుల గుప్పిట్లోకి వెళ్తోంది. గంజాయి మత్తులో యువకులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ, సమీపంలోని ఇళ్లపై మద్యం సీసాలు, రాళ్లు విసురుతున్నారు. అర్థరాత్రి వేళ వినిపిస్తున్న కేకలు, గొడవలతో కుటుంబాలతో నివసించే స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. కనీసం బయటకు వచ్చి అడిగే ధైర్యం లేక తలుపులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.బస్తీ దవాఖానాకు ప్రహరీ గోడ లేకపోవడమే ఈ ఆగడాలకు ప్రధాన కారణమని స్థానికులు మండిపడుతున్నారు. రక్షణ గోడ లేకపోవడంతో ఆవరణ అంతా బహిరంగ మరుగుదొడ్డిగా, తాగుబోతుల తావళంగా మారిపోయింది. దవాఖానా కిటికీలు, ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తుండటం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.ఈ అరాచకాలపై స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తక్షణమే స్పందించాలని ఇందిరానగర్ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన దవాఖానా చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని, రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా సీసీ కెమెరాలు కూడా లేకపోవడం కూడా ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమ కాలనీలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here