- ఇంటర్ విద్యార్థులకు విద్యావేత్తల భరోసా
- పోటీ పరీక్షల సన్నద్ధతపై ప్రభావం పడనీయకండి
జనవాహిని ప్రతినిధి తాండూరు : ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడుతున్న తరుణంలో విద్యార్థులు ఆందోళన చెందకుండా, ఫలితాన్ని సానుకూలంగా స్వీకరించాలని విద్యావేత్త పర్యాద రామకృష్ణ సూచిస్తున్నారు. పరీక్షల కోసం విద్యార్థులు పడిన శ్రమ ఇప్పటికే పూర్తయిందని, ఇప్పుడు ఫలితం ఎలా ఉన్నా దాని ప్రభావం భవిష్యత్తు లక్ష్యాలపై పడకుండా చూసుకోవడం కీలకమని పేర్కొంటున్నారు.ముఖ్యంగా ద్వితీయ సంవత్సర విద్యార్థులు తాము రాయబోయే నీట్ (NEET), ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (EAPCET) వంటి పోటీ పరీక్షలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు. ఇంటర్ ఫలితాల వల్ల వచ్చే ఒత్తిడి, రాబోయే కీలక పరీక్షల సన్నద్ధతను దెబ్బతీయకూడదని హితవు పలికారు. ఆశించిన ఫలితాలు సాధించిన వారు అదే ఉత్సాహంతో పోటీ పరీక్షల్లో రాణించాలని, లక్ష్య సాధనలో విజేతలుగా నిలవాలని పర్యాద రామకృష్ణ ఆకాంక్షించారు.ఒకవేళ ఆశించిన ఫలితం రాకపోయినా విద్యార్థులు మనోస్థైర్యాన్ని కోల్పోకూడదని విజ్ఞప్తి చేశారు. ఫలితాల కంటే పట్టుదల ముఖ్యమని, ఉన్నత విద్యలో తమ ప్రతిభను నిరూపించుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి, తాము నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ తెలియజేశారు.



