- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జోలికొస్తే ఖబడ్దార్..!
- కాంగ్రెస్పై బురదజల్లడం మానుకోవాలి
- ఓటమి భారంతోనే మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విమర్శలు
- మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ నీరజా బాల్రెడ్డి..!
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, పలువురు నేతలు మాట్లాడుతూ…ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 41 శాతం ఓట్లతో ఘన విజయం సాధించిందని, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించినా రోహిత్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదని నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల మధ్య వర్గపోరు కారణంగా తాండూరు అభివృద్ధి కుంటుపడిందని, ఇప్పుడు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేతృత్వంలో ఏటీసీ సెంటర్, రోడ్ల వంటి అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని గుర్తు చేశారు.కాంగ్రెస్ గుర్తుపై గెలిచి స్వార్థం కోసం బీఆర్ఎస్లో చేరి రంగులు మార్చిన చరిత్ర మీది కాదా? అని రోహిత్ రెడ్డిని నిలదీశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రౌడీల్లా ప్రవర్తించి, దౌర్జన్యానికి దిగినందుకే పోలీసులు చట్టరీత్యా కేసులు నమోదు చేశారని, వాటిని రాజకీయం చేయడం తగదని హితవు పలికారు. వచ్చే మూడేళ్లలో తాండూరును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేది కాంగ్రెస్ పార్టీయేనని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని స్థానికేతరుడు కాదు అనడం హాస్యాస్పదమని, ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.ఈ సమావేశంలో నాయకులు అబ్దుల్ రవూఫ్, సర్దార్ ఖాన్, మాజీ కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, జుబేర్ లాల తదితరులు పాల్గొన్నారు.



