- టెన్త్ పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్ అమలు
- జిల్లా వ్యాప్తంగా 69 కేంద్రాల వద్ద ఆంక్షలు
- ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు అమలు
- జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా
జనవాహిని ప్రతినిధి వికారాబాద్ : రేపటి నుంచి ఏప్రిల్ 16 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ మేరకు జిల్లాలోని మొత్తం 69 పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 BNSS (గతంలో సెక్షన్ 144 CrPC) అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా, IPS ఒక ప్రకటనలో వెల్లడించారు.పరీక్షలు జరిగే రోజుల్లో ఉదయం 8:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ తెలిపారు. ప్రధానంగా పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఐదుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమిగూడకూడదు. పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేఫ్లు, స్టేషనరీ షాపులను తప్పనిసరిగా మూసివేయాలి.అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, బ్లూటూత్ పరికరాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడంపై కఠిన నిషేధం విధించారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, మైకులతో కూడిన ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు.పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరూ ఎటువంటి భయాందోళనలు లేకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఎస్పీ విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్’ తెలిపారు.






