- ఆస్తిపన్ను వసూళ్లలో వేగం పెంచండి…!
- నిర్లక్ష్యం వహిస్తే సిబ్బందిపై చర్యలు తప్పవు
- 100 శాతం లక్ష్యంగా పనిచేయాలి: మున్సిపల్ కమిషనర్ పి. మధుసూదన్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ పి. మధుసూదన్ రెడ్డి అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లతో ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరువలో ఉన్నందున పన్ను వసూళ్లలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేశారు. మున్సిపల్ ఆదాయం పెరిగితేనే పట్టణంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టవచ్చని, ఇందుకు ప్రజలు కూడా సహకరించాలని కోరారు. పాత బకాయిలు ఉన్నవారికి తక్షణమే రెడ్ నోటీసులు జారీ చేయాలి.పన్ను వసూళ్ల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వీరు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి పన్ను వసూలు చేయాలన్నారు. వసూళ్ల సమయంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా పన్నులు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, జి. రాములు, బిల్ కలెక్టర్లు, వార్డు అధికారులు పాల్గొన్నారు.



