- ఇందిరమ్మ ఇంటికి నీరు పడుతూ..
- విద్యుత్ షాక్తో మహిళ మృతి
జనవాహిని ప్రతినిధి తాండూరు : నిర్మించుకుంటున్న సొంత ఇంటి కల ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా గోడలకు నీరు పడుతుండగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మరణించిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల పరిధిలోని రస్నం గ్రామానికి చెందిన శశికళ (34) అనే మహిళ, ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకుంటున్నారు. సోమవారం ఉదయం నిర్మాణంలో ఉన్న ఇంటి గోడలకు ఆమె క్యూరింగ్ (నీరు పట్టడం) చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ మోటార్ వైర్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో ఆమెకు తీవ్రమైన షాక్ తగిలింది.గమనించిన కుటుంబ సభ్యులు మరియు స్థానికులు వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, విద్యుత్ ఘాతానికి ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన శశికళ మృతితో రస్నం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.




