- డాన్స్ మాస్టర్ అశోక్ సేవలు మరువలేనివి: బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
- అశోక్ కుటుంబాన్ని పరామర్శించిన నేత
- ఆయన కుమారుడికి ఆర్ బి ఓ ఎల్ లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : కళా రంగంలో తాండూరు ప్రాంతానికి డాన్స్ మాస్టర్ అశోక్ చేసిన సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన అశోక్ మాస్టర్ నివాసానికి గురువారం ఆయన చేరుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అశోక్ మాస్టర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఎంతో మంది యువతీ యువకులను ఉత్తమ డాన్సర్లుగా తీర్చిదిద్దిన ఘనత అశోక్ మాస్టర్కే దక్కుతుందన్నారు. పోతురాజు విన్యాసాలు కేవలం అశోక్ మాస్టర్ కే సాధ్యమన్నారు. ఆయన అకాల మరణం తాండూరు కళాకారుల లోకానికి పెద్ద లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గురువుగానే కాకుండా, ఎందరో పేద విద్యార్థులను ప్రోత్సహించిన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు.అశోక్ మాస్టర్ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తామని ఆయన ప్రకటించారు. అశోక్ మాస్టర్ కుమారుడికి తన ఆధ్వర్యంలోని ఆర్.బి.ఓ.ఎల్ లో ఉద్యోగ అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు. విపత్కర సమయంలో ఒక మంచి కళాకారుడి కుటుంబానికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.



