- మున్సిపల్ పీఠాలపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే!
- వికారాబాద్ జిల్లాలోని 4 స్థానాలు మనవే: మంత్రి శ్రీధర్ బాబు
- రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించాం: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
- తాండూరు ప్రచారంలో కాంగ్రెస్ శ్రేణుల జోష్
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపల్ చైర్మన్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో కైవసం చేసుకోబోతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు పట్టణ పరిధిలోని పాత తాండూరు, గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన స్ర్టీట్ కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధారసింగ్ నాయక్తో కలిసి ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ప్రజలు పడ్డ కష్టాలను తొలగిస్తూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేశారు. త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు ఇస్తామని, కొత్త రేషన్ కార్డులతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్-బీజేపీ పార్టీలు లోపాయకారీ ఒప్పందాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు.ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. తాండూరు రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా సామాజిక న్యాయం పాటిస్తూ, కష్టపడే కార్యకర్తలకు, యువతకు, బీసీలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చామన్నారు. నేను శిలాఫలకాల నాయకుడిని కాదు.. పని చేసే వ్యక్తిని అంటూ, సుమారు రూ.100 కోట్లతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.పాత తాండూరు రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో ఇళ్లు కోల్పోయే వారికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తామని, వారందరికీ ప్రభుత్వం తరపున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. తాండూరు త్రాగునీటి సమస్య పరిష్కారానికి కాగ్నా నది ప్రాజెక్టును సిద్ధం చేశామన్నారు. మహిళల కోసం ఇప్పటికే రూ.15 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని వివరించారు. మున్సిపాలిటీని మళ్ళీ అవినీతిపరుల చేతికి ఇస్తే పట్టణం ఆగమవుతుందని, అభివృద్ధిని కాంక్షించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






