- గుండె కోత.. చిన్నారి చేత్తో తండ్రికి తలకొరివి..!
- కన్నీరుమున్నీరైన తాండూరు..
- ఉత్తమ ఉపాధ్యాయుడు దూస శ్రీనివాస్ అకాల మృతి
జనవాహిని ప్రతినిధి తాండూరు : అది ఆ కుటుంబానికి ఒక సాధారణ ఉదయం. విధి నిర్వహణ కోసం ఆ తండ్రి పాఠశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఆ చేతులు బ్యాగు సర్దుకుంటున్నాయి.. కానీ, కాలం మరోలా తలచింది. విధి ఆడిన వింత నాటకంలో ఒక నిబద్ధత గల ఉపాధ్యాయుడు, తెలంగాణ ఉద్యమ కెరటం దూస శ్రీనివాస్ (రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత) గుండెపోటుతో అనంత లోకాలకు వెళ్ళిపోయారు.శ్రీనివాస్ మరణం ఒక ఎత్తయితే, అంత్యక్రియల వేళ చోటుచేసుకున్న దృశ్యం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి చేత కన్నీరు పెట్టించింది. పట్టుమని పదేళ్లు కూడా నిండని తన కుమారుడు సాయి, తండ్రి పాడె ముందు నడుస్తూ అంతిమ సంస్కారాలు నిర్వహించడం చూసి పట్టణం యావత్తూ విలపించింది. “నాన్న.. లే నాన్న” అని ఆ చిన్నారి అమాయకపు చూపులు, తండ్రికి తలకొరివి పెట్టిన తీరు చూసి కఠిన పాషాణాలు సైతం కరిగి నీరయ్యాయి.శ్రీనివాస్ మరణవార్త తెలియగానే తాండూరు పట్టణం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూనే, తెలంగాణ మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన ఆయనకు నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు.రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ సంఘం నేతలు సహచర మిత్రులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు.వందల సంఖ్యలో అంతిమ యాత్రలో పాల్గొని ఆయనకు కడసారి వీడ్కోలు పలికారు.ఒక మంచి తండ్రిని, గొప్ప ఉపాధ్యాయుడిని, అంతకుమించి ఒక పోరాట యోధుడిని కోల్పోవడం తాండూరు ప్రాంతానికి తీరని లోటు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారుల భవిష్యత్తును తలచుకుని ప్రతి ఒక్కరూ భారమైన హృదయంతో వెనుతిరిగారు.



