- డిజిటల్ దెబ్బ.. వాట్సాప్లో ‘అభివృద్ధి’ రచ్చ!
- కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ‘కీ-బోర్డ్’ యుద్ధం
- నాయకులపై ఆరాధన..
- ప్రత్యర్థులపై విమర్శల బాణాలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల మధ్య రాజకీయం వేడి రోజు రోజుకు పెరుగుతుంది. ఇరు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే ఇది కేవలం పార్టీల నాయకుల మధ్య ఉందనుకుంటే పప్పులో కాలేసినట్టే.రాజకీయ సమరం వేదిక మారింది, వీధుల నుంచి స్మార్ట్ఫోన్ స్క్రీన్లకు చేరింది. తాండూరు లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ‘సైలెంట్ వార్’ నడుస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ‘అభివృద్ధి’ చుట్టూ తిరుగుతున్న చర్చలు కాస్తా.. పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా, నాయకుల వ్యక్తిగత ఇమేజ్ యుద్ధంగా మారుతున్నాయి.ప్రశ్నల వర్షం.. గణాంకాల యుద్ధం”మీ నాయకుడు ఏం చేశాడు?” – ప్రస్తుతం ప్రతి వాట్సాప్ గ్రూపులో వినిపిస్తున్న ప్రశ్న ఇది. కాంగ్రెస్ కార్యకర్తలు తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న గ్యారంటీలను, భవిష్యత్తు ప్రణాళికలను ఎత్తిచూపుతుంటే.. బీఆర్ఎస్ శ్రేణులు గత పదేళ్లలో జరిగిన మౌలిక సదుపాయాల కల్పనను, సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ కౌంటర్ ఇస్తున్నాయి.తమ పార్టీ నాయకుడిని ‘హీరో’గా చిత్రీకరిస్తూ రూపొందించిన ఎడిటెడ్ వీడియోలు, బీజీఎం లతో కూడిన రీల్స్ ఇప్పుడు గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో చర్చలు ఒక్కోసారి శృతిమించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్లవచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. పాత పేపర్ క్లిప్పింగులు, అసెంబ్లీలో నాయకులు మాట్లాడిన వీడియోలను కట్ చేసి, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగట్టడంలో కార్యకర్తలు పోటీ పడుతున్నారు.గ్రామాల్లోని రచ్చబండల దగ్గర జరగాల్సిన చర్చలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో జరుగుతుండటంతో అడ్మిన్లకు తలనొప్పిగా మారింది. పార్టీల మధ్య ఘర్షణలు పెరిగి గ్రూపులు విడిపోతుండటంతో.. గొడవలు ఆపలేక చాలామంది అడ్మిన్లు గ్రూపు సెట్టింగ్స్ను ‘ఓన్లీ అడ్మిన్’గా మారుస్తున్నారు. ఈ డిజిటల్ వార్ కేవలం ఫోన్లకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కూడా ప్రభావం చూపుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ఆధారంగా పట్టణం కూడా నాయకుల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల మూడ్ ముగిసినా, వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం రాజకీయ వేడి తగ్గకపోవడం గమనార్హం.



