- కొమ్మెర పసికందు మృతిపై బీసీ నేతల ఆగ్రహం
- నిందితులపై హత్య కేసు నమోదు చేయాలి: కందుకూరి రాజ్కుమార్ డిమాండ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : నాగర్కర్నూల్ జిల్లా కొమ్మెర గ్రామంలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడిలో రెండు నెలల పసికందు మృతి చెందడంపై జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూర్ నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుల అహంకారంతో నిరుపేద కుటుంబంపై దాడి చేసి, పసిప్రాణాన్ని బలిగొనడం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.మంగళవారం ఆయన ఓ ప్రకటన లో మాట్లాడుతూ.. బాధితులైన గణేష్-చంద్రకళ దంపతులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కేవలం అగ్రకుల అహంకారంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారని, రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలపై భౌతిక దాడులు పెరగడం ఆందోళనకరమని అన్నారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, వారిపై సెక్షన్ 302 కింద హత్య కేసుతో పాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కేసులో నిందితులకు అండగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లకు పోలీసులు లొంగకూడదని, నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం ప్రకటించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాజ్కుమార్ విజ్ఞప్తి చేశారు.



