- ఓట్ల గారడీతోనే గెలుపు.. 29వ వార్డులో భారీగా బోగస్ ఓట్లు!
- అధికారులకు బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
- ఎమ్మెల్యేపై విపక్ష నేతల సంచలన వ్యాఖ్యలు: “దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించు”
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలో రాజకీయ విమర్శలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గెలుపుపై విపక్షాలు సంచలన వ్యాఖ్యలు చేశాయి. గురువారం కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను శుక్రవారం బిఆర్ఎస్ నాయకులు ఖండించారు. 29వ వార్డులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు పలు అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టారు.మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో సుమారు 400 నుండి 500 వరకు బోగస్ ఓట్లు నమోదయ్యాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గతంలో జరిగిన ‘ప్రజా పాలన’ సర్వే సమయంలో, పక్కనే ఉన్న 36వ వార్డుకు చెందిన సుమారు 200 మంది ఓటర్లను నిబంధనలకు విరుద్ధంగా 29వ వార్డులోకి మార్చారని మండిపడ్డారు. ముఖ్యంగా ‘కుమ్మరి గల్లీ’ చిరునామా కలిగిన ఓటర్లను 29వ వార్డులోని ఇళ్లపై నమోదు చేశారని, ఆయా ఇంటి యజమానులకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హమని వారు పేర్కొన్నారు. దీనిపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్.ఏ.ఆర్ మ్యాపింగ్ ప్రక్రియలో కేవలం 18 శాతం మాత్రమే పూర్తయినప్పటికీ, రిటర్నింగ్ ఆఫీసర్ దానిని 40 శాతానికి పెంచాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వారు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే అండదండలతోనే ఈ అక్రమ ఓట్ల నమోదు జరిగిందని, తక్షణమే ఎన్నికల సంఘం స్పందించి క్షేత్రస్థాయిలో ‘ఇంటింటికీ’ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అక్రమ ఓట్లను తొలగించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఇదే వేదికపై నుంచి ఎమ్మెల్యే గెలుపుపై నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఒక్కో వార్డుకు 300 ఓట్లు లెక్కేసుకున్నా, 36 వార్డులకు కలిపి సుమారు 10 వేల చిల్లర ఓట్లు వస్తాయన్నారు. కానీ ఎమ్మెల్యే గెలిచింది కేవలం 6 వేల చిల్లర ఓట్లతోనే. ఇది స్పష్టంగా దొంగ ఓట్లతో సాధించిన విజయమన్నారు. మా నాయకుడు రోహిత్ రెడ్డి ఓడిపోలేదు, నువ్వు దొంగ ఓట్లతోనే గెలిచావు అని ధ్వజమెత్తారు. పట్టణంలోని డాక్ బంగ్లా స్థలంలో కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్ నిర్మిస్తామని ఎమ్మెల్యే ఇస్తున్న హామీలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికేనని వారు విమర్శించారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజల ముందు దోషిగా నిలబడక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు సుమిత్ గౌడ్ , విజయ్ కుమార్ ,శ్రీనివాస్ గౌడ్ , రవికాంత్ యాదవ్ , వెంకట్ లు ఉన్నారు.



