- జాతీయ స్థాయి సైన్స్ ఎక్స్పోలో తాండూరు విద్యార్థుల మెరుపు
- మొబైల్ మైక్రోస్కోప్” ప్రాజెక్టుకు జాతీయ స్థాయి పురస్కారం
- అక్షర హై స్కూల్ విద్యార్థినులను అభినందించిన ఇస్రో శాస్త్రవేత్తలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : జాతీయ విజ్ఞాన దినోత్సవం – 2026ను పురస్కరించుకుని నిర్వహించిన ప్రతిష్టాత్మక “విజ్ఞాన్ వైభవ్ 2.0” ఇండియన్ లెవల్ సైన్స్ ప్రాజెక్ట్ ఎక్స్పోలో తాండూరు పట్టణానికి చెందిన అక్షర హై స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి పురస్కారాన్ని గెలుచుకున్నారు.కైట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్రో , డి.ఆర్.డి.ఓ, ఏఈఎస్ఐ మరియు టీ-వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఎక్స్పోలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వందలాది మంది విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించారు.వికారాబాద్ల్ జిల్లా ప్రతినిధులుగా పాల్గొన్న అక్షర హై స్కూల్ 10వ తరగతి విద్యార్థినులు ఆదితి మరియు సంజనా వైష్ణవ్, రూపొందించిన “మొబైల్ మైక్రోస్కోప్” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తక్కువ ఖర్చుతో, సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో సూక్ష్మజీవులను పరిశీలించేలా వారు చేసిన ఈ ప్రయోగం న్యాయనిర్ణేతల ప్రశంసలు పొందింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా ఈ ప్రాజెక్ట్ ఉందని నిపుణులు కొనియాడారు.ఈ సందర్భంగా ఐ.ఎస్.ఎస్ ను సందర్శించిన తొలి భారతీయుడు, ఇస్రో వ్యోమగామి శ్రీ శుభాంశు శుక్లా, డి.ఆర్.డి.ఓ మాజీ చైర్మన్ డా. జి. సతీష్ రెడ్డి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం, ఎన్.ఆర్.ఎస్.సి డైరెక్టర్, స్పేస్ సైంటిస్ట్ డా. ప్రకాష్ చౌహాన్ చేతుల మీదుగా విద్యార్థులు ప్రత్యేక పురస్కారాన్ని అందుకున్నారు.విద్యార్థుల విజయానికి కృషి చేసిన గైడ్ టీచర్లు శ్రీ రవి కుమార్, శ్రీకాంత్ కులకర్ణిలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ కృష్ణ గౌడ్ అభినందించారు. విద్యార్థుల్లో పరిశోధనా తత్వాన్ని పెంపొందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ప్రవీణ్, యూనుస్, రవీందర్, శోభరణి మరియు తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల ప్రతిభను చాటిన అక్షర పాఠశాల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.



