Site icon janavahinitv

Kadiyam Bride Kidnap : కళ్లలో కారం కొట్టి, పెళ్లి కూతురి కిడ్నాప్ నకు యత్నం-ప్రేమ పెళ్లే అసలు కారణం!

Kadiyam Bride Kidnap : తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లిపీటల మీద నుంచి పెళ్లికూతురిని కిడ్నాప్ (Bride Kidnap)చేసేందుకు ప్రయత్నించారు. కళ్లలో కారం కొట్టి పెళ్లికూతురిని బలవంతంగా లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజమండ్రి రూరల్ లోని కడియం(Kadiyam)లో ఈ ఘటన చోటుచేసుకుంది. బంధువుల సమక్షంలో పెళ్లికూతురిని కిడ్నాప్ చేసేందుకు దుండగులు ప్రయత్నించడం కలకలం రేపింది.

పెళ్లికూతురి కిడ్నాప్ నకు యత్నం

మరికొన్ని గంటల్లో పెళ్లి… ఇంతలో కొందరు వ్యక్తులు పెళ్లి మండపంలోకి చొరబడ్డారు. పెళ్లికి వచ్చిన వారి కళ్లలో కారం కొట్టి పెళ్లి పీటల మీద నుంచి వధువును కిందకు లాగేశారు. బంధువులు స్పందించే లోపు…పెళ్లికూతురిని తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బంధువులు ప్రతిఘటించడంతో కాసేపు ఘర్షణ తలెత్తింది. అత్యంత అమానుషంగా పెళ్లి కూతురిని మండపంలో లాక్కెళ్లారు. ఇది గమనించి బంధువు కిడ్నాపర్ల నుంచి పెళ్లికూతురిని రక్షించేందుకు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. పట్టపగలు అంత దర్జాగా కిడ్నాప్(Kadiyam Bride Kidnap) కు యత్నించారంటే… ఏదైనా బలమైన కారణం ఉండి ఉంటుందని పెళ్లికి వచ్చిన వాళ్లు అంటున్నారు.

అసలేం జరిగింది?

నంద్యాల (Nandyal)జిల్లా గొడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ, రాజమండ్రి రూరల్ కడియంకు చెందిన బత్తిన వెంకట నందు నరసరావుపేటలోని ఓ కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదువుకున్నారు. కాలేజీలో ఉన్నప్పుడు వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఈ నెల 13న వీరిద్దరూ విజయవాడ(Vijayawada) దుర్గగుడిలో కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కడియం వచ్చిన వెంకట నందు ఇంట్లో తన ప్రేమ పెళ్లి (Love Marriage)గురించి చెప్పాడు. దీనికి నందు ఇంట్లో పెద్దలు అంగీకరించారు. ఈ నెల 21న బంధువుల సమక్షంలో మరోసారి వీరికి వివాహం చేయాలని నిర్ణయించారు. నంద్యాలలోని తన ఇంటికి వెళ్లిన వధువు స్నేహ…. ప్రేమ పెళ్లి గురించి ఇంట్లో చెప్పింది. ఆమె తల్లిదండ్రుల కూడా పెళ్లికి అంగీకరించారు. ఈ నెల 21 కడియం(Kadiayam)లోని ఓ ఫంక్షన్ హాలులో వీరి వివాహం జరుగుతుండగా… వధువు తరపు బంధువులు అక్కడికి చేరుకుని ఘర్షణ పడ్డారు. వరుడు బంధువులపై కారం కొట్టి పెళ్లి కూతురు స్నేహను కిడ్నాప్ చేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. వరుడి బంధువులు ప్రతిఘటించడంతో…పెద్ద గొడవ జరిగింది. వధువును బలవంతంగా తీసుకెళ్తున్నప్పుడు కొందరు వీడియోలు తీశారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Social Media Viral) అవుతున్నాయి. ఈ దాడిలో వరుడి బంధుల్లో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అతడిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడి అనంతరం తన బంధువులు అక్కడి నుంచి వెళ్లిపోయారని, తర్వాత తమ వివాహం జరిగిందని పెళ్లి కూతురు స్నేహ మీడియాతో చెప్పారు.

Exit mobile version