Home ఎంటర్టైన్మెంట్ వైఎస్ ఫ్యాన్స్ లో ‘యాత్ర 2’ చిచ్చు.. దారుణంగా కొట్టుకున్నారు!

వైఎస్ ఫ్యాన్స్ లో ‘యాత్ర 2’ చిచ్చు.. దారుణంగా కొట్టుకున్నారు!

0

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘యాత్ర 2’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా వైఎస్ అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. ఒక థియేటర్ లో వైఎస్ జగన్ అభిమానులు, ఆయన సోదరి వైఎస్ షర్మిల అభిమానులు ఒకరిపై ఒకరు భౌతికంగా దాడి చేసుకోవడం సంచలనంగా మారింది.

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం 2019లో విడుదలైంది. ఇప్పుడు వైఎస్సార్ మరణం నుండి వైఎస్ జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘యాత్ర 2’ వచ్చింది. అయితే జగన్ రాజకీయ ప్రస్థానంలో షర్మిల పాత్ర కీలకం. అవినీతి ఆరోపణల కేసులో జగన్ జైలుకి వెళ్లిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెట్టింది షర్మిల అనేది జగమెరిగిన సత్యం. అయితే ‘యాత్ర 2’ సినిమాలో అసలు షర్మిల ప్రస్తావనే లేదు. షర్మిల రాజకీయంగా జగన్ ని విభేదించడంతోనే.. ఆమెకి క్రెడిట్ రాకూడదన్న ఉద్దేశంతో సినిమాలో ఆమె పాత్రని చూపించలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై జగన్, షర్మిల అభిమానుల మధ్య దాడి జరగడం హాట్ టాపిక్ గా మారింది.

‘యాత్ర 2’లో షర్మిల పాత్ర గొప్పగా ఉంటుందని థియేటర్ కి వచ్చిన ఆమె అభిమానులు.. అసలు ఆమె పాత్రనే లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షర్మిల పేరుతో నినాదాలు చేశారట. అయితే వారి అసహనాన్ని అర్థం చేసుకొని జగన్ అభిమానులు వారితో వాదనకు దిగారట. ఈ క్రమంలో మాట మాట పెరిగి ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగినట్లు సమాచారం. ఈ ఘటన హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఈ కొట్లాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Exit mobile version